కోరిక తీర్చలేదని ప్రియుడే కడతేర్చాడు

8 Jun, 2016 19:26 IST|Sakshi
కోరిక తీర్చలేదని ప్రియుడే కడతేర్చాడు

మెదక్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన కోరిక తీర్చలేదన్న కోపంతో వివాహితను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంచార్జ్ డీఎస్‌పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం లక్ష్మిసాగర్ పంచాయతీ సువాలీ తండాకు చెందిన గోరాం సురేష్, సుశీల (30) దంపతులు సంగారెడ్డిలో అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే, బస్వాపూర్ గ్రామానికి చెందిన వెండికోలు రాజు కొంతకాలంగా సుశీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో పనులకు వెళ్లిన రాజు, సుశీల ఒకే బస్సులో స్వగ్రామానికి వచ్చారు.అదే రోజు  సాయంత్రం ముదిమాణిక్యం గ్రామంలో సుశీల, బస్వాపూర్‌లో రాజు బస్సు దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే రాజు సుశీలకు ఫోన్ చేసి ముదిమాణిక్యం వద్దనే ఉండాలని ఆమెకు సూచించాడు. అయితే అప్పుడే సుశీలకు భర్త సురేష్ ఫోన్ చేసి.. నడుచుకుంటూ ముందుకు రావాలని, తాను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో వెంటనే ఆమె ఆ విషయాన్ని రాజుకు తెలిపింది. రాజు మాత్రం తాను వచ్చేంతవరకు అక్కడే ఉండాలని పట్టుబట్టాడు. ఆమె వినకుండా ముదిమాణిక్యం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న సువాలీ తండా వైపు నడిచి వెళుతోంది. రాజు ఫోన్ చేస్తుంటే ఆమె కట్ చేసింది. అంతలోనే అక్కడికి బైక్‌పై చేరుకున్న రాజు... ఆమెను అడ్డగించాడు. తన భర్త వస్తున్నాడు వెళ్లిపోవాలని ఆమె ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కోరిక తీర్చాలంటూ గొడవకు దిగాడు.

ఆమె ప్రతిఘటించటంతో పక్కనే ఉన్న విద్యుత్ వైరుతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని దగ్గరలోని బావిలోకి తోసేసి తన ఇంటికి వెళ్లి వెళ్లిపోయాడు. భర్త సురేష్ రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. మరుసటిరోజు ఉదయం తండా మార్గమధ్యంలో భార్య కాలిచెప్పును గుర్తు పట్టి వెతకగా పాడుబావిలో శవమై కనిపించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిగా వెండికోలు రాజును అనుమానించి విచారించారు. సుశీలతో రెండు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అతడు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

మరిన్ని వార్తలు