కొందుర్గు : పీహెచ్సీలో వైద్య సేవలు బాగున్నాయని రాష్ట్ర బృందం సభ్యులు కితాబునిచ్చారు. బుధవారం కొందుర్గు పీహెచ్సీ పనితీరు, రోగులకు కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ బృందంలో రాష్ట్ర సంయుక్త కమిషనర్ డాక్టర్ విక్రమ్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రతినిధి శ్రీనివాస్, డాక్టర్ సహీద్తోపాటు జిల్లా వైద్యాధికారి నాగారామ్, షాద్నగర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ చందునాయక్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, ఆపరేషన్ థియేటర్, బయటి రోగుల విభాగం, ప్రసూతి గది, ల్యాబ్లను చూశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డాక్టర్ షాదాబ్కు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విలేకరులతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగారామ్ మాట్లాడుతూ కొందుర్గు పీహెచ్సీ రాష్ట్రంలోనే మోడల్ పీహెచ్సీగా ఎంపికైందన్నారు.