గుంటూరు రూరల్ : కొండ దిగువ పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఎలుగుబంటి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ సిబ్బంది, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం పాతనేని వారిపల్లెకు చెందిన కె.పెద్ద అచ్చయ్య స్థానికంగా వ్యవసాయం పనులు చేసుకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం అదే జిల్లాకు చెందిన రాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో తన బావ మరిది నాగయ్య పొలంలో పనులు ఎక్కువగా ఉండటంతో బావమరిదికి సాయంగా ఉండేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారు జామున గ్రామంలోని కొండ దిగువన గల నాగయ్యకు చెందిన పొలంలో పనులు చేస్తుండగా ఎలుగుబంటి, దాని పిల్ల కలిసి ఆతనిపై దాడి చేశాయి. దీంతో అచ్చయ్య పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఎలుగులను పారదోలి స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం అచ్చయ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.