చెవి కమ్మలు ఇవ్వలేదని భార్యను హత్య..

3 Aug, 2016 21:30 IST|Sakshi
యశోద మృతదేహం

మల్కాజిగిరి: చెవికమ్మలు అమ్ముకొని మద్యం తాగుతానంటే భార్య నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడో తాగుబోతు. మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డి, మృతురాలి తమ్ముడు నరేష్‌ కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్‌తో షాబాద్‌ మండలానికి చెందిన యశోద(32)కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో ఉంటున్నారు. యశోద తమ్ముడు నరేష్‌ అక్కకు తోడుగా ఉంటూ స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. క్యాటరింగ్‌ పనిచేసే ప్రభాకర్‌ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు.

తాగుడుకు కూడా బానిసై తరచూ భార్యను వేధించేవాడు. చిత్తూర్‌ వెళ్లిన ప్రభాకర్‌ ఈనెల 2వ  తేదీ రాత్రి ఇంటికి వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు లేవని చెప్పడంతో చెవి కమ్మలు ఇస్తే అమ్ముకొని మందు తాగుతానని అన్నాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు బావమరిది పని చేసే దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పాడు. దీంతో నరేష్‌ బంధువులకు సమాచారం ఇవ్వగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ అక్కను బావ వేధించేవాడని, తన అక్క చావుకు అతనే కారణమని నరేష్‌ పేర్కొన్నాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని, పోస్ట్‌మార్టం నివేదిక  అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌  తెలిపారు.

మరిన్ని వార్తలు