కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మధ్యాహ్న భోజన పథకం వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా పాఠశాల సంచాలకుడికి పంపాలని ఎంఈఓలను డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో ఎంఈఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిరోజు పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను పాఠశాల సంచాలకుడికి ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఎంఈఓలు నిరంతరం పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఏఎంఓ హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ..గతేడాది స్కూల్ గ్రాంట్ల నిధులకు సంబంధించిన ఈసీలను ఈనెల 31వ తేదీలోపు సమర్పించాలన్నారు. లేకుంటే ఈ యేడాది గ్రాంట్లను కేటాయించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు పాల్గొన్నారు.