సేవకు ప్రతిరూపం నర్సింగ్‌ వృత్తి

8 Oct, 2016 02:20 IST|Sakshi
సేవకు ప్రతిరూపం నర్సింగ్‌ వృత్తి
 
  •  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌
నెల్లూరు(అర్బన్‌): నర్సింగ్‌ వృత్తి సేవకు ప్రతిరూపమని రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ది ట్రెయిన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(టీఎన్‌ఏఐ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్‌ సేవలపై తొలి రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్‌ స్థానిక అచ్యుత సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కామినేని మాట్లాడూతూ డాక్టర్‌ రోగిని ఐదు నిమిషాలు మాత్రమే పరిశీలిస్తాడన్నారు. తరువాత 24 గంటల పాటు అడ్మిట్‌ అయిన రోగిని కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత నర్సులపైనే ఉందన్నారు. నర్సింగ్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల 28శాతం ఓపీ పెరిగిందన్నారు.నాణ్యమైన వైద్య సేవలందించేందుకు తాము కృషి చేస్తామన్నారు. నర్సింగ్‌ అసోసియేషన్‌ కోసం స్థలం మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అసోసియేషన్‌ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సభలో నర్సింగ్‌ సేవలకు సంబందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నర్సింగ్‌ సేవలు, సమస్యలు గురించి వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఏఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి, డా.ఇందిర, నర్సింగ్‌ డెప్యూటీ డైరెక్టర్‌ వేదమణి, రిజిస్ట్రార్‌ రోజారాణి, డీఎం అండ్‌ హెచ్‌ఓ డా.వరసుందరం, బీపేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నిర్వాహకులు ప్రభుదాస్, పద్మావతి, ఝాన్సిలక్ష్మీబాయి, మాధురి, సుశీల, బొల్లినేని, నారాయణ, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. 
రొట్టెల పండుగ ఏర్పాట్ల పరిశీలన
అనంతరం మంత్రి శ్రీనివాస్‌ బారాషహీద్‌ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు జరగడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి అభివృద్ది పనులకు నిధులు విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
 
 
మరిన్ని వార్తలు