రేషన్‌పక్కదారి పట్టిస్తే ఉపేక్షించొద్దు

27 Oct, 2016 23:17 IST|Sakshi
  • పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత
  • అధికారులు, డీలర్లతో సమీక్ష
  • స్టాక్‌ పాయింట్‌ గోడౌన్‌ తనిఖీ
  • పాల్గొన్న హోం మంత్రి రాజప్ప తదితరులు
  • కాకినాడ సిటీ :
    రేషన్‌సరుకులు పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా, ఏపార్టీ వారైనా ఉపేక్షించవద్దని, అలాంటి డీలర్లను సస్పెన్షన్‌లో ఉంచాలని పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశపు హాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి  అధికారులు, మిల్లర్లు, రేషన్‌ డీలర్లతో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ కొంత మంది కేవలం ఇళ్లు, ఇళ్లస్థలాలు, వైద్యం, ఉపకార వేతనాల కోసమే రేషన్‌ కార్డులు తీసుకుంటున్నారన్నారు.అవసరం లేకపోతే బియ్యం, కిరోసిన్‌ తీసుకోవద్దని అలాంటి కుటుంబాల వారికి ఆమె విజ్ఞప్తి చేశారు. రేషన్‌ తీసుకోని కార్డులను తొలగించబోమన్నారు. ప్రభుత్వంపై భారం పడినా డీలర్ల కమిషన్‌ గణనీయంగా పెంచామని, వారు నిజాయితీగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయవద్దన్నారు.ఎవరైనా రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌కు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
     
    రవాణా చార్జీలు చెల్లించాలి
    ఉప ముఖ్యమంత్రి  చినరాజప్ప మాట్లాడుతూ ధాన్యా న్ని రైతు రవాణా చేస్తే రైతు ఖాతాకు, మిల్లర్‌ రవాణా చేస్తే మిల్లరుకు రవాణా చార్జీలు చెల్లించాలన్నారు. మధ్యలో దళారులెవరూ రైతులను మోసగించకుండా నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ అమలు, రేషన్‌ షాపుల భర్తీ, దీపం గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ తదితర అంశాల గురించి వివరించారు.
     
    నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం
    రైస్‌మిల్లు పరిశ్రమను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. తమకు న్యాయం చేసి నష్టపోకుండా ఆదుకోవాలని జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మంత్రిని కోరారు. మిల్లింగ్‌ చార్జీలు పెంచాలని కోరారు. కస్టమ్‌ మిల్లింగ్‌కు బ్యాంక్‌ గ్యారెంటీల విషయంలో రాష్ట్రం వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరారు. 2014–15 సంవత్సరపు ధాన్యం కొనుగోలు రవాణా చార్జీల బకాయిలు రూ.6 కోట్లూ తక్షణమే ప్రభుత్వం చెల్లించేలా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
     
మరిన్ని వార్తలు