విద్యా వ్యవస్థలో మనం దేశానికే ఆదర్శం

28 Jun, 2016 02:22 IST|Sakshi
విద్యా వ్యవస్థలో మనం దేశానికే ఆదర్శం

తెలంగాణలో సరికొత్త విప్లవం
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటలో తొలి మైనార్టీ గురుకుల పాఠశాల ప్రారంభం
పాల్గొన్న ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్

 సిద్దిపేట జోన్: విద్యా వ్యవస్థలో మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల విద్యావ్యవస్థలో స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకుల పాఠశాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. సోమవారం పట్టణ శివారులోని పొన్నాల వద్ద తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మైనార్టీ గురుకుల పాఠశాలను రాష్ట్ర సొసైటీ చైర్మన్, ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే రెండేళ్లలో గురుకుల పాఠశాలల నిర్వహణకు రూ.4వేల కోట్లను ఖర్చుచేస్తామన్నారు. ఇంగ్లిష్ మీడియంలో ఉర్దూ, తెలుగు భాషలతోపాటు ముస్లిం విద్యార్థులకు నమాజ్ చేసే అవకాశాన్ని కూడా క ల్పిస్తున్నామన్నారు.

 అధ్యయన బాటలో మూడు రాష్ట్రాలు...
మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకం పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలువనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రూ.1,200 కోట్లను బడ్జెట్‌లో ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఏకే ఖాన్‌లు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, పొన్నాల సర్పంచ్ రాజమణి, ఎంపీటీసీ నారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ నజీమ్‌ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు