అదృశ్యమై.. శవమై కనిపించాడు!

4 Jun, 2016 11:49 IST|Sakshi

అద్దంకి: ఓ వ్యక్తి రెండు నెలల క్రితం అదృశ్యమై శుక్రవారం శవమై కనిపించాడు. ఈ సంఘటన మండలంలోని వెంపరాల కొండపై వెలుగు చూసింది. ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై సీహెచ్‌ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు వెల్లడించారు.

ఎస్సై కథనం ప్రకారం.. వెంపరాలకు చెందిన నేరెళ్ల యోహాన్‌ (50)కి భార్య అన్నమ్మ ఉంది. ముగ్గురు కుమార్తెలుకాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు హైదరాబాదులో బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో యోహాన్‌ తరచూ మద్యం తాగి భార్యను, గ్రామస్తులను ఇష్టం వచ్చినట్లు తిడుతుండేవాడు. రెండు నెలల క్రితం భార్యపై పోట్లాడి రూ.వెయ్యి తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పురుగుమందు డబ్బా, మద్యం సీసా కొనుగోలు చేసి కొండపైకి వెళ్లి అక్కడ రెండూ కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త కనిపించకపోవడంతో మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి ఉంటాడని భార్య భావించింది. ఈ నేపథ్యంలో ఉపాధి పనుల్లో భాగంగా కొండపై కందకాలు తీసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ యోహాన్‌ మృతదేహం ఆనవాళ్లు గుర్తించి పోలీసులు, ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని వార్తలు