ఎమ్మెల్యే కారు దొరికిందోచ్

7 Mar, 2016 03:54 IST|Sakshi
ఎమ్మెల్యే కారు దొరికిందోచ్

కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంట్లో చోరీకి గురైన స్కార్పియో వాహనం ప్రత్యక్షమైంది. వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని గిప్సన్ కాలనీలోని ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటి వద్ద నుంచి గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వాహనంతో పాటు ఇంట్లో సూట్‌కేసులో ఉన్న రూ.20వేల నగదు అపహరించి ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు ఇంటివద్ద ఉన్న సీసీ పుటేజి హార్డ్ డిస్క్‌ను కూడా దొంగలు తీసుకెళ్లారు. వాహనం కనిపించకపోవడంతో శుక్రవారం ఎమ్మెల్యే సమీప బంధువు గౌతం రెడ్డి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ ములకన్న  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. వాహన డ్రైవర్ మహనందితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించారు. దొంగలు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు వాహనాన్ని ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్కుచేసి వెళ్లారు. చోరీకి  గురైన ఎమ్మెల్యే వాహనం ఎట్టకేలకు ప్రత్యక్షం కావడతో అటు పోలీసులు, ఇటు వాహన యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

 

మరిన్ని వార్తలు