కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీ- ఎమ్మెల్యే రోజా

19 Sep, 2016 19:47 IST|Sakshi

- వెంకయ్య, చంద్రబాబే హోదాకు అడ్డంకి
- కాణిపాకంలో విలేకరుల సమావేశంలో నగిరి ఎమ్మెల్యే రోజా


కాణిపాకం (చిత్తూరు జిల్లా): నెల్లూరుకు చెందిన కేంద్రమంతి వెంకయ్య నాయుడు, చిత్తూరుకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాకు అడ్డుగా ఉన్నారని నగిరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఆ ఊసే ఎత్తుడంలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటున్నారన్నారు.

ప్యాకేజీలకు ఆశపడి ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారిద్దరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయక స్వామివారిని కోరుకున్నట్లు రోజా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని,  తద్వారా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు సమకూరుతాయన్నారు. కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీని రాష్ట్రానికి కేటాయించి రాష్ట్రానికి మనుగడ లేకుండా చేస్తున్నారన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నవారు ఇప్పుడు అవసరంలేనట్టు ప్రవర్తించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక హోదా కేటాయించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు