► అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
► ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ఆదోని ఎమ్మెల్యే మండిపాటు
ఆదోని టౌన్: ‘ఎండలు మండిపోతున్నాయి. ప్రజలతోపాటు పశువులు దాహంతో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వాలని అధికారులను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు బనాయిస్తారా?’ అంటూ అధికారుల తీరుపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కార్యాలయాల్లో ఫ్యాన్ల కింద కూర్చుంటే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గొంతులెండిపోతున్నాయని, గుక్కెడు నీళ్లివ్వాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సహనం కోల్పోయిన ఢణాపురం మహిళలు, సర్పంచు ఈరన్నగౌడ్, నాయకులు వీరయ్య, నర్సింహస్వామి బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం సబబు కాదన్నా రు. అధికారుల తీరుపై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రస్తు తం జిల్లా కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
సర్పంచ్ ఈరన్నగౌడు, ఆందోళనకారులు వైఎస్ఆర్సీపీ కావడంతోనే అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను విత్డ్రా చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అధికారులు పక్షపాతం వీడకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేషిరెడ్డి పాల్గొన్నారు.