ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

12 Dec, 2016 15:03 IST|Sakshi

అనంతపురం అర్బన్‌:  పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి బుధవారం విడుదల చేశారు.ఈ వివరాలను ఆమె విలేకరులకు వెల్లడించారు. వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,24,109 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 మంది నమోదయ్యారు. 2,44,354 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా.. 20,245 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 21,856 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. 3,470 తిరస్కరణకు గురయ్యాయి. డబుల్‌ ఎంట్రీలను, ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు లేనివాటిని తిరస్కరించారు. డిసెంబర్‌ ఎనిమిది వరకు క్లెయింలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు తిరస్కరణకు గురై ఉంటే, అలాంటి వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిములను, అభ్యంతరాలను డిసెంబరు 26లోగా పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

>
మరిన్ని వార్తలు