మొబైల్‌ ఫోన్‌ పేరుతో మోసం

22 Dec, 2016 22:27 IST|Sakshi
మొబైల్‌ ఫోన్‌ పేరుతో మోసం

– రూ.16వేలు విలువ చేసే మొబైల్‌ ఫోన్‌ రూ. 4500కే మీ సొంతం అంటూ మెసేజ్‌  
- పార్సిల్‌ విప్పి చూస్తే అందులో రూ.50 విలువ చేసే బొమ్మలు


బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో హెచ్‌ఆర్‌ఏగా పనిచేస్తున్న ఎస్‌.గౌస్‌పీర్‌ తన మొబైల్‌ ఫోన్‌లో కొత్తగా వొడాఫోన్‌ సిమ్‌ను వేసుకొన్నాడు. వేసుకొన్న మరుక్షణమే ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో రూ.16వేలు విలువ చేసే స్యామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్‌ కేవలం రూ.4500కే వస్తుందని ఉండటంతో ఆశపడిన గౌస్‌పీర్‌ కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు.

గురువారం స్థానికంగా ఉన్న పోస్టల్‌ ఉద్యోగి పార్సిల్‌ను తీసుకొని వచ్చి ఇచ్చి రూ.4500 డబ్బు తీసుకున్నాడు. సెల్‌ ఫోన్‌ వచ్చిందనే ఆశతో ఆ పార్సిల్‌ను తెరచి చూడగా అందులో రెండు చిన్న బొమ్మలు ఉన్నాయి.  వాటి విలువ రూ.50 ఉంటుంది. బిత్తర పోయిన గౌస్‌పీర్‌ కుటుంబ సభ్యులు రూ.4500 డబ్బులు తిరిగి ఇస్తారా అని పోస్టుమాస్టర్‌ను అడిగారు. పార్సిల్‌ ఇవ్వడమే తమ డ్యూటీ అని తిరిగి డబ్బులు వెనక్కు ఇవ్వలేమని చెప్పడంతో లబోదిబోమన్నారు. కాగా, ఆ పార్సిల్‌ దిల్లీ నుంచి శివ ఎంటర్‌ ప్రైజస్‌ పేరుతో వచ్చింది.

మరిన్ని వార్తలు