కన్నబిడ్డ బలికి ఓ తల్లి యత్నం!

23 May, 2016 10:34 IST|Sakshi
కన్నబిడ్డ బలికి ఓ తల్లి యత్నం!

రాజమహేంద్రవరంలో ‘గుప్త నిధుల’ కలకలం
 
 సాక్షి, రాజమహేంద్రవరం: గుప్తనిధుల కోసం కన్నబిడ్డను బలివ్వడానికి ఓ మహిళ ప్రయత్నించిందంటూ వచ్చిన ఆరోపణలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలకలం రేపాయి.కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన తడాల గణపతి రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో అద్దెకు ఉంటున్నాడు. రంపచోడవరం మండలం బి.వెలమకోటకు చెందిన పార్వతి తన భర్తను వదిలేసి దేవీపట్నం మండలం గంగపాలేనికి చె ందిన కోసు వెంకన్నదొరతో ఉంటోంది. వీరికి అమలాపురానికి చెందిన ఏసీ మెకానిక్ కాళీ రామ్‌కుమార్, గణపతితో పరిచయముంది.

ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పార్వతి తనకు ఒంట్లో బాగోలేదంటూ మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె పావని(6), వెంకన్నదొర, కాళీ రామ్‌కుమార్‌లతో కలసి గణపతి ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి ఇంట్లో ఏవో పూజలు చేశారు. అనంతరం ఇంటి వెనుక ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన  స్థానికులు క్షుద్రపూజలు జరుగుతున్నాయని, బాలికను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. గణపతి ఇంట్లో తనిఖీలు చేసి  పూజా సామగ్రి, కత్తి, పార, గునపం స్వాధీనం చేసుకున్నారు. బాలికను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తల్లితో వచ్చినట్లు తెలిపింది. ఎం.శ్రీనివాస్, మరో ఇద్దరు నిందితులు పరారయ్యారని సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు.

మరిన్ని వార్తలు