కన్నకూతురిని హతమార్చిన తల్లి

7 Jul, 2016 12:43 IST|Sakshi
కన్నకూతురిని హతమార్చిన తల్లి

విజయవాడ: బెజవాడ వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే రక్తం పంచుకు పుట్టిన కూతురిని హతమార్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే పేగు బంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి... కన్న కూతుర్నే కడతేర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి  పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లు చుట్టుపక్కలవారిని నమ్మించింది.

 వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు మాట వినకపోవడంతో బీబీజాన్‌కు కోపం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది.

అనంతరం కూతురు కడుపు నొప్పితోనే చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. స్వస్థలం కంచికచర్లలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే చలాకీగా కనిపించిన యువతి ఆకస్మాత్తుగా చనిపోవడంపై ప్రియుడికి అనుమానం వచ్చింది. అతడు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. నజ్మా మృతదేహాన్ని పోస్ట్మార్టంకు పంపగా, నివేదికలో హత్యగా తేలింది. దీంతో బీబీజాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు