బిర్కూర్: నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దుర్తికి చెందిన నాగమణి(35)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు రెండేళ్ల జేతశ్రీతో పాటు మూడు నెలల చిన్న పాప ఉంది. కుటుంబకలహాల నేపథ్యంలో మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
గమనించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలు ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త వ్యవసాయ కూలి. అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.