కంబాలచెరువు (రాజమహేంద్రవరం):
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఎంపీ మాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాన్వాయ్లను సోమవారం అడ్డగించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్లో జాబ్మేళాను ప్రారంభించడానికి వెళ్తున్న వారిని ఆపి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందిస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు వి.కనకరాజు, జీఎల్ మాణిక్యం, యు.లక్ష్మణరావు, చిక్కాల నర్సింహారావు, కుమార్రాజు, సాంబశివనాయుడు, వాణి, బీవీ నాయుడు, వేదమూర్తి పాల్గొన్నారు.