ముదిరాజ్‌లను బీసీ–ఎ జాబితాలో చేర్చవద్దు

31 Dec, 2016 22:48 IST|Sakshi
ముదిరాజ్‌లను బీసీ–ఎ జాబితాలో చేర్చవద్దు

గంగపుత్రుల డిమాండ్‌
► కలెక్టరేట్‌ ముట్టడి
► అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటనపై తీవ్రనిరసన


సిరిసిల్ల : ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని బీసీ–ఎ జాబితాలో చేర్చుతున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేయడం సరికాదని గంగపుత్రులు అన్నారు. సీఎం ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీప్రదర్శన నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు. చెరువుల్లో చేపలు పట్టే వృత్తిలో ఉన్న నిజమైన మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని, సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా బీసీ–ఎ జాబితాలోని 53 ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్లం చేశారు. అణగారిన కులాలు అధికంగా ఉన్న బీసీ–ఎ జాబితాకు 7శాతం రిజర్వేషన్ సరిపోదన్నారు. వీరి మధ్య ఇప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ ను 14శాతానికి పెంచి ముదిరాజ్‌లను బీసీ–ఎ గ్రూపులో చేర్చితే తమకు అభ్యంతరం లేదని అన్నారు.

అనంతరామన్ కమిషన్ కులాలు, వృత్తుల విషయంలో ఇదే స్పష్టత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ తన ప్రకటనపై పునరాలోచించాలని గంగపుత్రులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, ప్రధాన కార్యదర్శి ఖాత మల్లేశం, నాయకులు నర్సయ్య, రవి, మహేశ్, తోకల తిరుమల్, పారిపెల్లి శ్రీనివాస్, వెంగల శ్రీనివాస్, పరశురాములు, కె.శ్రీధర్, మునీందర్, సాయాబు, ప్రశాంత్, హన్మయ్య, దేవరాజు, రాజయ్య, శ్రీనాథ్, ఎల్లయ్య, శంకర్, శివప్రసాద్, సాయికుమార్, సతీశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు