► నిరవధిక నిరాహార దీక్షల ప్రారంభంలో నాయకుల డిమాండ్
నగరంపాలెం : రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జిల్లా, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జిల్లా, అంతర్జిల్లా బదిలీలు కోరే ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలోని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ (డీఎంఏ) ప్రాంగణం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం, జెడ్పీ, ఉపాధ్యాయులకు విధిగా బదిలీలు జరుపుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు 17 ఏళ్లుగా ఒక్కసారిగా కూడా బదిలీలు జరపకపోవటం శోచనీయమన్నారు. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ప్రభుత్వాన్ని ఒప్పించైనా ఈ వేసవిలో బదిలీలు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యాచరణ కమిటీ సభ్యులు పి. సనాఉల్లా మాట్లాడుతూ ప్రభుత్వం వి«ధిగా అందరితోపాటు మున్సిపల్ టీచర్ల బదిలీలు జరుపుతూ ఉండాలన్నారు. దీనిపై ఎమ్మెల్సీ, ఫ్యాప్టో, జాక్టోలు సరైన శ్రద్ధ చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్వీ రత్నం, సి. నారాయణ, ఎంఏ సత్తార్, 13 జిల్లాలకు చెందిన మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.