మహిళపై హత్యాయత్నం

1 Nov, 2016 00:55 IST|Sakshi
మహిళపై హత్యాయత్నం
 
ఓజిలి : తన వివాహేతర సంబంధం కొనసాగించాలని ఓ మహిళపై ఆమె ప్రియుడు హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని రావిపాడులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన గుంజి కళావతి భర్త నాగారాజు నాలుగేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన యనమల వెంకటేశ్వర్లుతో కళావతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడేళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో కళావతి కుమారుడు అనంతకుమార్‌ పెద్దవాడు కావడంతో తనతో వివాహేతర సంబంధంను మానుకోవాలని ఆమె వెంకటేశ్వర్లుకు తెలిపింది. ఇందుకు నిరాకరించిన వెంకటే శ్వర్లు పలుమార్లు కళావతితో గొడవ పడ్డాడు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలపడంతో వెంకటేశ్వర్లును మందలించారు. ఆదివారం దీపావళి కావడంతో కళావతి వజ్జవారిపాళెంలో గుడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. గ్రామ సమీపంలోకి వచ్చే సరికి ఆమెకు ఎదురుగా బైక్‌పై వచ్చిన వెంకటేశ్వర్లు నీతో మాట్లాడాలంటూ చేయి పట్టుకుని లాగడంతో ప్రతిఘటించిన ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకున్నారు. ఆమెను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సాంబశివరావు చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు