ఆస్తి కోసమే హత్య?

19 Jan, 2017 23:58 IST|Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు – పరారీలో మరో ఇద్దరు
కొత్తచెరువు : బుక్కపట్నం చెరువుకట్ట సమీపంలోని నడిమిగుట్ట వద్ద బుధవారం జరిగిన సంకేపల్లికి చెందిన గోపాల్‌నాయుడు హత్యకు ప్రధాన కారణం ఆస్తి కోసమేనని తెలుస్తోంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. గోపాల్‌నాయుడు ఎనిమిది నెలల కిందట రెండో పెళ్లి చేసుకుని బుక్కపట్నంలో కాపురం పెట్టాడు. అప్పటి నుంచి మొదటి భార్యకు ఆయన దూరంగా ఉంటున్నాడు. రెండో భార్యకు పిల్లలు పుడితే నాయుడు భూమిని పంచాల్సి ఉంటుందని మొదటి భార్య భావించినట్లు భావిస్తున్నారు. ఆస్తంతా తమకే దక్కాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నట్లు పోలీస్‌ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ క్రమంలో నార్పల మండలం పప్పురుకు చెందిన తన సమీప బంధువుతో ఆమె మంతనాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పథకం అమలులో భాగంగా తనకు దక్కే ఆస్తిలో సగభాగం ఇస్తానని ఆమె చెప్పడంతో అ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరొకరితో పాటు అనంతపురానికి చెందిన ఇంకో వ్యక్తి సహకారంతో హత్యకు అనంతపురంలో పథకం రచించిన సమాచారాన్ని పోలీసులు సేకరించగలిగారు. ఈ కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు