అగ్రశ్రేణి వర్శిటీగా ‘గీతం’

30 Mar, 2017 23:09 IST|Sakshi

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అడ్రికేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏఏసీ–నాక్‌) తాజాగా వెలువరించిన ఫలితాల్లో గీతం యూనివర్శిటీకి అగ్రస్థానం లభించినట్లు వర్శిటీ ఉపకులపతి ఆచార్య ఎంఎస్‌ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 28న జరిగిన నాక్‌ 23వ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఏ+ గ్రేడు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నాక్‌ నూతన గ్రేడింగ్‌ విధానంలో ఏ+ స్థానాన్ని అందుకున్న దేశంలోని డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో గీతం అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు.

దక్షిణ భారతదేశంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, సైన్స్, మేనేజ్‌మెంట్, అంతర్జాతీయ వాణిజ్య విద్య, వైద్య విద్యా కోర్సులతో నాక్‌ ఏ+ గ్రేడింగ్‌ సాధించిన ఏకైక విశ్వవిద్యాలయంగా గీతం ఖ్యాతి గడించిందన్నారు. అదేవిధంగా 138 యూజీ, పీజీ, డాక్టరల్‌ కోర్సులతో దక్షిణ భారతంలోని అతి పెద్ద విశ్వవిద్యాలయంగా స్థానం సంపాదించుకుందన్నారు. నాక్‌ ఏ+ సాధించి అత్యుత్తమ యూనివర్శిటీగా గుర్తింపును పునరుద్ధరించుకోవడంపై వర్శిటీ చాన్సలర్‌ రామకృష్ణారావు, రిజిస్ట్రార్‌ పోతరాజు, యూజీసీ వ్యవహారాల డైరెక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ విశ్వవిద్యాలయ వర్గాలకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు