మరోచోటకు కలెక్టరేట్‌!

21 Oct, 2016 16:54 IST|Sakshi
మరోచోటకు కలెక్టరేట్‌!

 పీఆర్‌ అతిథిగృహంలో ఏర్పాటు చేసే అవకాశం
 ఆర్డీఓ కార్యాలయాన్నీ పరిశీలిస్తున్న అధికారులు
నాగర్‌కర్నూల్‌:
కలెక్టరేట్‌ను పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం (ఐఓసీ) నుంచి సమీపంలోని ఆర్డీఓ కార్యాలయానికిగానీ, పీఆర్‌ అతిథిగృహంలోకి గానీ మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి నాలుగు రోజులక్రితం కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ ఈ భవనాలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఐఓసీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కోర్టును నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయాన్ని మూడో అంతస్తులో ఏర్పాటు చేశారు. అయితే కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చే వారు మూడు అంతస్తులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిపోయే అతిథులు, ప్రజాప్రతినిధులు, బాధితులతో ఇతర కార్యాలయాలకు అంతరాయం కలుగుతోంది. దీంతో నేరుగా కలెక్టరే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మూడో అంతస్తులో ఉ న్న కలెక్టరేట్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌కు మార్చాల ని మొదట భావించినా ఇక్కడ కాకుండా మరోచోట కలెక్టరేట్‌ ఉంటేనే బాగుం టుందని ఈ ఆలోచన చేశారంటున్నారు.

వారం పదిరోజుల్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ను మార్చేందుకు అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఇందులోభాగం గా దగ్గర్లోని ఆర్డీఓ కార్యాలయంలో ప లు మార్పులు, మరమ్మతులు చేసేం దుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ నివాస గృహంగా ఉన్న పంచాయతీరాజ్‌ అతిథిగృహాన్ని కలెక్టరేట్‌ చేయాలన్న ఆలోచన ఉంది. ఇక్కడైతే కలెక్టర్‌ కార్యాలయంతోపాటు సంబంధిత శాఖలకు సరిపోయినంత స్థలం ఉండటంతో దీనిపైనే అధికారులంతా మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్‌ నివాసాన్ని ఆర్డీఓ కార్యాలయానికి మార్చి పీఆర్‌ అతిథిగృహాన్ని పూర్తిస్థాయి కలెక్టరేట్‌గా మార్చేందుకు కలెక్టర్‌  సుముఖత చూపినట్లు అధికారులు తెలిపారు. ఐఓసీలో ప్రస్తుతం 17 శాఖలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. కలెక్టరేట్‌ ఖాళీ అయితే మరో ఐదారు శాఖలకు అక్కడ ఆఫీస్‌లు ఏర్పాటు చేసేందుకు అవకాశం లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అతి త్వరలోనే కలెక్టరేట్‌ను మార్చేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం

మరిన్ని వార్తలు