ఐదు గ్రామాలకు పట్టణ హోదా!

26 Apr, 2017 01:24 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పెనుగొండ, మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు గ్రామాలను కలిపి పెనుగొండ నగర పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిని నగర పంచాయతీలుగా గుర్తిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. ఇప్పటికే టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు ఆ గ్రామాల నైసర్గిక స్వరూపం, జనాభా వివరాలను పేర్కొంటూ నగర పంచాయతీలుగా మార్చేందుకు నివేదికలు పంపారు.  ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూ రు మున్సిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీతో కలుపుకుని 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరో 5 నగర పంచాయతీలు ఏర్పాటైతే.. జిల్లాలోని మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరుతుంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్తగా ఏర్పడే అత్తిలి, ఆకివీడు, వీరవాసరం, పెనుగొండ, చింతలపూడి నగర పంచా యతీలుగా ఏర్పాటవుతాయని మున్సి పల్‌  వర్గాలు తెలిపాయి.
 
మున్సిపాలిటీల్లో కలవనున్న గ్రామాలు
పట్టణాలను ఆనుకుని ఉండే ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 32 గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీ నం కానున్నాయి. ఇలా విలీనమయ్యేవి వ్యవసాయేతర గ్రామాలై ఉండాలి. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలను మాత్రం మున్సిపాలిటీల్లో విలీనం చేయరు. పట్టణాలను ఆనుకుని కొంతమేర పట్టణ, పారిశ్రామిక, వాణిజ్య వాతావరణం కలిగిన గ్రామాలను మాత్రమే విలీనం చేస్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో 10 గ్రామాలను, భీమవరం మున్సిపాలిటీలో 6 గ్రామాలను, పాలకొల్లు మున్సిపాలిటీలో 3 గ్రామాలను, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 9 గ్రామాలను, తణుకు మున్సిపాలిటీలో 4 గ్రామాలను విలీనం చేయనున్నారు. దీనివల్ల జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గుతుంది. 
జిల్లాలో ప్రస్తుతం 928 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో కలిసే 32 పంచాయతీలు, ఐదు నగర పంచాయతీల ఏర్పాటుతో పంచాయతీల సంఖ్య ఆ మేరకు తగ్గిపోతుంది. జిల్లాలో కొత్త నగర పంచాయతీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం విషయాన్ని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ రీజినల్‌ డెప్యూటీ డైరెక్టర్‌ పి.సాయిబాబ ధ్రువీకరించారు.
 
>
మరిన్ని వార్తలు