ప్రత్యేక గుర్తింపు ఉంటేనే న్యాయవాదికి భవిష్యత్తు

12 Feb, 2017 22:57 IST|Sakshi
ప్రత్యేక గుర్తింపు ఉంటేనే న్యాయవాదికి భవిష్యత్తు
నాగార్జున వర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్‌ జయశ్రీ  
కాకినాడ లీగల్‌ (కాకినాడ సిటీ) : న్యాయ విద్యార్థిగా పట్టా పొందడం గొప్పకాదని,  న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నవారికే భవిష్యత్తు ఉంటుందని నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్‌ జయశ్రీ అన్నారు. జేఎన్‌టీయూకే ఆడిటోరియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఏఐఎల్‌యూ–ఐలు) జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ క్లాస్‌లకు హాజరుకాకుండా పరీక్షలు రాసేవారికి లా పట్టా వస్తుందే తప్ప ‘లా’ రాదన్నారు. ఇంటర్నెట్‌పై కంటే టెక్టŠస్‌బుక్‌ను చదివితేనే అవగాహన వస్తుందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుం దన్నారు. అనంతపురం ఎస్‌కేడీ వర్సిటీ ప్రొఫెసర్‌ ఎస్‌వీ పుల్లారెడ్డి మాట్లాడుతూ లా విద్యకు పెట్టిన వయసు నిబంధన  మంచిదేనన్నారు. బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గోకుల్‌కృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలపై అవగాహన  ఉంటేనే కేసును వాదించగలరన్నారు. కాకినాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బచ్చు రాజేష్‌ మాట్లాడుతూ సంపద  ఆశించకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు.  రాజీవ్‌ గాంధీ లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ చిన్నస్థాయి లా కళాశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చేరతారని, వారిని దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కల్పించాలన్నారు.  ఐలు జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల మాదిరిగా జూనియర్‌ న్యాయవాదులకు ఇవ్వాలని కోరతామన్నారు. కాకినాడ సీనియర్‌ న్యాయవాది జవహర్‌ఆలీ మాట్లాడుతూ న్యాయవాదికి సేవాదృక్పథం ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు