దేవుని భక్తి.. 'క్షుద్ర శక్తుల' శాసనం..!

13 Feb, 2016 16:29 IST|Sakshi

తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు   భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి.

అయితే ఈసారి పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి  (ఈనెల 3న) రోజున  మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ  దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు  దూరం అయినట్టే.

ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం  హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో  ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 భయం.. భయం..
 మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్‌పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి  పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం  చెప్తున్నారు.

ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు.

మరిన్ని వార్తలు