ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు

7 Oct, 2016 22:50 IST|Sakshi
ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు
భువనగిరి టౌన్‌: ఈ నెల 3వ తేదీ నుంచి భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన అండర్‌–19 జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్, షూటింగ్‌ బాల్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 44 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమితో నిరాశ చెందకుండా మరింత మెరుగ్గా రాణిస్తే గెలుపు సొంతం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య మాట్లాడుతూ భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతాయన్నారు. అనంతరం విజేతలకు కప్, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఓ ఎన్‌. ప్రకాశ్‌బాబు, టీఎన్‌జీఓ రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు జడల అమరేందర్, భువనగిరి ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపాల్, పీఈటీ జిల్లా కార్యదర్శి టి. విజయసాగర్, ఎస్‌జీఎఫ్‌ జిల్లా అర్గనైజింగ్‌ కార్యదర్శి జి. దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జి. సోమనర్సయ్య, డివిజన్‌ అధ్యక్షుడు కె.గోపాల్‌ పాల్గొన్నారు. 
విజేతలు వీరే
– జాతీయ స్థాయి బాల్‌బాడ్మింటన్‌ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మెుదటి స్థానంలో నిలువగా, కర్నాటక ద్వితీయ, తమిళనాడు తృతీయ స్థానాల్లో నిలిచాయి.
– బాల్‌బాడ్మింటన్‌ బాలికల విభాగంలో తమిళనాడు ప్రథమ స్థానం సాధించగా, కేరళ ద్వితీయ, కర్నాటక తృతీయ బహుమతులు సాధించాయి.
– షూటింగ్‌ బాల్‌ బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి, పంజాబ్‌ ద్వితీయ, ఢిల్లీ తృతీయ బహుమతులు సాధించాయి.
– షూటింగ్‌ బాల్‌ బాలికల విభాగంలో మహారాష్ట్ర మెుదటి, ఢిల్లీ ద్వితీయ, తెలంగాణ తృతీయ బహుమతులు సాధించాయి.
 
 
 
మరిన్ని వార్తలు