24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు

8 Feb, 2017 22:47 IST|Sakshi
24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు
బ్రోచర్‌, ఆహ్వాన పత్రిక విడుదల  
ఉప్పలగుప్తం (అమలాపురం) : మహాశివరాత్రి, కోనసీమ ఉత్సవ శోభ ఉత్సవాలను పురస్కరించుకుని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల బ్రోచర్, ఆహ్వాన పత్రికలను బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. గొల్లవిల్లిలోని  చినరాజప్ప కల్యాణ మంటపంలో టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు అధ్యక్షతన టోర్నీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్నేళ్లుగా అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్‌వీఆర్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ద్వారా ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడాకారులు హజరవుతారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ కోశాధికారి, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య. కార్యదర్శి మద్ధింశెట్టి సుబ్బరాజు (సురేష్‌) మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో వాలీబాల్‌ కోర్టు, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్‌వీఆర్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గొలకోటి సత్తిరాజు, సాంకేతిక పర్యవేక్షకులు ఉండ్రు రాజబాబు, సభ్యులు షేక్‌ చినవలీ, సలాది సత్తిబాబు, గుర్రాల దుర్గాప్రసాద్, నిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్రకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, అమలాపురం జోన్‌ పీఈటీల సంఘ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఎస్సై డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు