నయీం.. బాబు పెంచిన విషనాగు

10 Aug, 2016 16:25 IST|Sakshi
నయీం.. బాబు పెంచిన విషనాగు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నరహంతక ముఠా నాయకుడు నయీం చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన విష నాగు అని, ప్రజా కళాకారులను, ప్రజా సంఘాల నాయకులను, పౌరహక్కుల నేతలను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడు నయీం అని అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.

చంద్రబాబునాయుడు అండదండలతోనే  నయీం గ్యాంగ్‌స్టర్‌ స్థాయికి ఎదిగాడని, నక్సలైట్లను అంతమొందించటానికి చంద్రబాబునాయుడు ఇలాంటి ‘బ్లాక్‌ కోబ్రా’లను పెంచారని రామలింగారెడ్డి ఆరోపించారు. 2004లో ఒకసారి, 2008లో మరోసారి నయీం తనను బెదిరించిన మాట వాస్తవమే అని చెప్పారు. 2008లో తమ గ్రామం చిట్టాపూర్‌కు నయీం అతని అనుచరులు వచ్చి రామలింగారెడ్డిని చంపివేస్తామని బెదిరించి వెళ్లిపోయారని, దీనిపై తాను అప్పట్లో సిద్దిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లుగా నయీం నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అప్పటి నాయకులు, అధికారులు ఈ రాక్షసుని చేతిలో కీలుబొమ్మలుగా మారారని చెప్పారు. దుబ్బాక పరిసర గ్రామాల్లో నయీం ముఠా ముగ్గురిని కిడ్నాప్‌ చేసిందని, వారి ఆచూకీ ఇప్పటికీ దొకరలేదన్నారు.

ఈ జీవితం నాకు బోనస్‌
20 ఏళ్ల కిందట గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లోనే తాను అమరున్ని కావాల్సిందని, ఆరోజు అదృష్టం బాగుండి బయటపడ్డానని అన్నారు. ఇప్పుడున్న ఈ జీవితం, ఎమ్మెల్యే పదవి తనకు బోనస్‌ లాంటివన్నారు. తనకు ప్రాణాల మీద తీపి, డబ్బుమీద ఆశ లేదన్నారు. నయీం లాంటి హంతకుల హెచ్చరికలు తనకు వెంట్రుకతో సమానం అని అన్నారు.

ఇప్పటికీ తాను గన్‌మెన్స్‌ లేకుండానే ప్రజల్లో తిరుగుతానన్నారు. మంత్రి హరీశ్‌రావు, సీఎం విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఒకే ఒక గన్‌మెన్‌ను పెట్టుకున్నానన్నారు. తనకు దుబ్బాక ప్రజలే రక్షణ కవచాలన్నారు. నయీం పీడ విరగడ కావటమనే సంఘటనతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు