కిడ్నీ రోగులపై నిర్లక్ష్యం

4 Feb, 2017 23:35 IST|Sakshi
కిడ్నీ రోగులపై నిర్లక్ష్యం
  • ప్రైవేటు భాగస్వామ్యం కన్నా ప్రభుత్వ సేవలే మిన్న
  • నెల్లూరు పెద్దాస్పత్రిలో పరిస్థితి
  • కిడ్నీలు దెబ్బతిని.. డయాలసిస్‌ కోసం నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు నెల్లూరులోని పెద్దాస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సేవలు అందుతున్నాయి. ఒక డయాలసిస్‌  విభాగాన్ని అధునాతన మిషనరీ పేరుతో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. మరో డయాలసిస్‌ విభాగాన్ని ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోన్న డయాలసిస్‌లో రోగులకు సౌకర్యాలు అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    నెల్లూరు(అర్బన్‌):నగరంలోని పెద్దాస్పత్రిలో ఓ ప్రైవేటు సంస్థ ఆరోగ్యశ్రీ నిధులతో  కిడ్నీ రోగులకు సేవలందిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు నిధులు విడుదల చేస్తారు. వార్డు పెద్దాస్పత్రికి చెందినదైనప్పటికీ మిషనరీ, పారిశుద్ధ్యం, ఏసీ లాంటి వసతులన్నీ ఆ ప్రైవేటు సంస్థే సమకూర్చుకోవాలి. రోగులకు డయాలసిస్‌ విభాగంలో ఏసీ కచ్చితంగా ఉండాలి.  ఆ సంస్థ పరిధిలో 12 యూనిట్లు(బెడ్లు) ఉన్నాయి. ఒక రోగికి వివిధ సిటింగ్‌లలో డయాలసిస్‌ చేస్తే ప్రభుత్వం ఆ ప్రైవేటు సంస్థకు రూ.12,500 ఇస్తుంది. వార్డును, నీటిని , విద్యుత్‌ను వాడుకున్నందుకు డిశ్చార్జి అయ్యేనాటికి ఎన్ని రోజులున్నా ఆ నగదులో రూ.1500 ప్రభుత్వ ఆస్పత్రికి ఆ సంస్థ చెల్లిస్తోంది. డిశ్చార్జి అయి మళ్లీ సేవలందించేటప్పుడు మరో రూ.12,500ను ప్రైవేటు సంస్థకు ఆరోగ్యశ్రీ వారు చెల్లిస్తారు. ఇలా రోగి అడ్మిట్‌ అయినప్పుడల్లా చెల్లిస్తారు.  
    సేవలు దారుణం
    డబ్బులు తీసుకుంటున్న ఆ సంస్థ రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయిందనే ఆరోపణలున్నాయి. రోగులు నిరుపేదలు, నిరక్షరాస్యులు కావడం, ప్రశ్నించలేని తత్వమే కాబోలు ఇలా చేస్తున్నారని విమర్శలున్నాయి.  

    సేవల్లో లోపాల్లో కొన్ని..
    ► రెండు ఏసీలు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు. ఉన్న ఏసీల నుంచి సరిగా గాలి రావడం లేదు. ఉక్కపోత ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవల తనిఖీల సందర్భంగా ఆస్పత్రి అ«భివృద్ధి కమిటీ చైర్మన్‌ చాట్ల నరసింహారావే నిర్వాహకులను నిలదీశారు.
    ► పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బాత్‌రూం వద్ద నుంచి వస్తున్న దుర్గంధం రోగులు భరించలేకున్నారు.   
    ► వార్డులో పైన కొన్ని లైట్లు మరమ్మతులకు గురయ్యాయి

    ఆస్పత్రి డయాలసిస్‌ మిన్న..
     ప్రభుత్వ ఆస్పత్రి నేరుగా మూడు డయాలసిస్‌ యూనిట్లను నిర్వహిస్తోంది. ఇక్కడ ఏసీ బాగా పనిచేస్తుండడంతోపాటు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంది.  

    లోపాలు సరిచేయమని చెప్పా
    రోజు వారి తనిఖీల్లో భాగంగా ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న డయాలసిస్‌ విభాగాన్ని ఇటీవల తనిఖీ చేశా. అందులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఏసీలు పనిచేయడం లేదు. వాటిని బాగు చేయించాలని నిర్వాహకులను కోరా.  
    –చాట్ల నరసింహారావు,పెద్దాస్ప అభివృద్ధి కమిటీ చైర్మన్‌

మరిన్ని వార్తలు