అత్యాధునిక సేవల్లో ఎస్‌బీఐ

19 Aug, 2016 23:35 IST|Sakshi

‘అనంత’లో తొలి డిజిటల్‌ బ్రాంచి ప్రారంభం

అనంతపురం అగ్రికల్చర్‌: అన్ని బ్యాంకుల కన్నా అత్యాధునిక సేవలు అందించడమే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్‌ ఇన్‌టచ్‌ బ్రాంచిని తొలిసారిగా ‘అనంత’లో ఏర్పాటు చేశామని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తిరుపతి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) ఎం.బాలసుబ్రమణియన్‌ తెలిపారు. నగరంలోని సూర్యానగర్‌ మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన డిజిటల్‌ బ్రాంచిని శుక్రవారం ఆర్‌ఎం ఎంవీఆర్‌ మురళీకృష్ణ, బ్రాంచి మేనేజర్‌ ఎస్‌వీ ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీఎం, ఆర్‌ఎం మాట్లాడుతూ ఇక్కడ నగదు, పేపరు, మనషులతో పనిలేకుండా ఆధునిక యంత్రపరికరాలు, కంప్యూటర్లతోనే బ్యాంకింగ్‌ సేవలు పొందవచ్చన్నారు. కైవేసీ ఫారాలు ఉంటే ఖాతాదారులు స్వంతంగానే కొత్తగా ఖాతాలు తెరవడం, ఏటీఎం కార్డులు పొందడం, చెక్‌బుక్కులు తీసుకోవడం, లావాదేవీలు జరపడం, నెట్‌ బ్యాంకింగ్, స్వయం సేవా మిషన్‌ ద్వారా పాస్‌బుక్కులో వివరాలు నమోదు చేసుకోవడం లాంటివి సులభంగా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. హౌసింగ్, వెహికల్‌ లోన్లు కూడా తీసుకోవచ్చన్నారు. డిజిటల్‌ ఇన్‌టచ్‌ బ్రాంచి 24 గంటలూ పని చేస్తుందన్నారు.

ఈ అవకాశాన్ని ఖాతాదారులు అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఖాతాదారుల స్పందనను బట్టి భవిష్యత్తులో ధర్మవరం, హిందూపురం, కదిరి పట్టణాల్లో కూడా ఇలాంటి శాఖను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారులు హరిబాబు, శ్రీకాంత్, విద్యాసాగర్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు