ఉద్యోగం కోసం వెళుతూ నవదంపతుల దుర్మరణం

13 May, 2016 23:22 IST|Sakshi
ఉద్యోగం కోసం వెళుతూ నవదంపతుల దుర్మరణం

భూత్పూర్: వివాహం జరిగి నెల రోజులైనా గడవకముందే నవదంపతులు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయలుదేరిన ఆ ఇద్దరూ అనూహ్యరీతిలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

వనపర్తి పట్టణంలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన కాటి రవికుమార్‌కు (28), తెల్కపల్లి మండలంలోని చిన్నముద్దునూరు వాసి శ్రీలత (25)తో నెలరోజుల క్రితమే వివాహమైంది. రవికుమార్ వనపర్తిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, శ్రీలత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగానూ పనిచేస్తున్నారు. కాగా, నర్సింగ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు శ్రీలత ఊరు చిన్న ముద్దునూరు నుంచి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు బైక్ పై బయలుదేరారు. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. భర్త అక్కడికక్కడే చనిపోగా, భార్య శ్రీలత జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మార్చురీలో రవి, శ్రీలతల మృతదేహాలు.

whatsapp channel

మరిన్ని వార్తలు