రాజంపేటః రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు రంగంసిద్ధం చేస్తున్న క్రమంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ నుంచే..కొత్తది ఆవిష్కతం కానుందని రెవెన్యూ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. బద్వేలు డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొనసాగుతోంది. ఇది వరకు డివిజన్ ఏర్పాటు క్రమంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసింది. జిల్లాలో ప్రస్తుతం కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్లు ఉన్నాయి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర భూపరిపాలన ప్రధానకమిషనర్ (సీసీఎల్ఏ)అనిల్చంద్రపునేత రూపొందించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏడు నుంచి తొమ్మిది మండలాలకు ఒక డివిజన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీసీఎల్ఏ కమిషనరు మార్గదర్శకాలతో రాయచోటి, పులివెందులను డివిజన్ చేసే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. బద్వేలు డివిజన్ ప్రతిపాదన తొలినుంచి ఉంది. ప్రభుత్వం ఎటువైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సి.
రాజంపేట డివిజన్ ప్రస్తుతం ఇలా..
రాజంపేట డివిజన్లో అట్లూరు, బ్రహ్మంగారిమఠం, బీ,కోడూరు, బద్వేలు, గోపవరం, కలసపాడు, రైల్వేకోడూరు, చిట్వేలి‡ నందలూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, సిద్ధవటం, శ్రీ అవధూత కాశీనాయన, ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, పెనగలూరు మండలాలు ఉన్నాయి. కొత్త డివిజన్(బద్వేలు) ఏర్పాటు చేస్తే అట్లూరు, బీ.మఠం, బద్వేలు, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశీనాయన మండలాలు ఉండవచ్చునని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.
మినీకలెక్టరేట్గా రాజంపేట సబ్కలెక్టరేట్గా..
జిల్లాలో కలెక్టరు మాదిరిగా డివిజన్ స్ధాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారిని సర్వాధికారిని చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకువెళుతోంది. జిల్లా కలెక్టరేట్ తర్వాత ఐఏఎస్ అధికారిచే పాలన చేసే స్థాయి రాజంపేట సబ్కలెక్టరేట్కు ఉంది. 20మందికిపైగా ఐఏఎస్లు పనిచేసి రాష్ట్రస్ధాయి వరకు వెళ్లారు. ఇప్పుడు కూడా రాష్ట్ర, కేంద్రస్ధాయిలో ఉన్నతపదవుల్లో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం కాబట్టి మినీకలెక్టరేట్గా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
డివిజన్ కేంద్రమైన రాజంపేట నుంచి బద్వేలు, బీమఠం, కాశినాయన,పోరుమామిళ్ల, కలసపాడు లాంటి ప్రాంతాలకు అధికారులు వెళ్లాలన్న..అక్కడి నుంచి ప్రజలు రావాలన్న వందకిలోమీటర్లకుపైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. రాజంపేట నుంచి బద్వేలుకు 90కిలోమీటర్లు, అక్కడి నుంచి బీమఠానికి 35కిలోమీటర్లు, పోరుమామిళ్లకు 35 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి కాశినాయనకు 15కిలోమీటర్లు, కలసపాడుకు 12కిలోమీటర్లు ఉంటుంది. ఇక పల్లెలకు వెళ్లాలంటే 200 కిలోమీటర్ల పైమాటే. బద్వేలు డివిజన్ ఎర్పాటుచేసుకోవడం వల్ల పరిపాలన సౌలభ్యంతోపాటు ప్రజలు వ్యయప్రయసాలకు గురికానవసరంలేదన్న భావన అటు రెవెన్యూ, ఇటు మైదుకూరులోని బీమఠం, బద్వేలులోని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు.