నిర్విఘ్నంగా నిమజ్జనానికి!

13 Sep, 2016 00:13 IST|Sakshi
నిర్విఘ్నంగా నిమజ్జనానికి!

– వినాయక ఘాట్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి
– నగరమంతా భద్రత కట్టుదిట్టం
–  రంగంలోకి వజ్ర వాహనం
– అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా

==========================
మొదటి ఊరేగింపు: ఉదయం 9.30 గంటలకు రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభం. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.హెచ్‌. విజయమోహన్, ఎస్పీ ఆకె రవికష్ణ హాజరు.
రెండో ఊరేగింపు: మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి చౌరస్తా నుంచి ప్రారంభం.
మూడో ఊరేగింపు: చెన్నమ్మ సర్కిల్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం.
ఉత్సవాన్ని వీక్షించే జనం: లక్ష మంది
నగరంలో వినాయక విగ్రహాలు : రెండు వేలకు పైగా
నిమజ్జనానికి వినియోగించే క్రేన్లు: 6
పాల్గొనే ప్రభుత్వ శాఖలు..
ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, అగ్నిమాపక
==============
కర్నూలు:
వినాయక ఉత్సవాల్లో అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. వాడావాడా ఏకమై జరిపే సంబరానికి సర్వం సిద్ధమైంది. శోభాయాత్రకు వీధులన్నీ అలంకరించుకున్నాయి. మంగళవారం కర్నూలులో గణేశ్‌ నిమజ్జన వేడుకలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కర్నూలులో నిమజ్జన వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వినాయకఘాట్‌ వద్ద గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఘాట్‌కు ఇరువైపులా మిరిమిట్లు గొలిపే వందకుపైగా ఫ్లడ్‌ లైట్స్‌ ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు తావులేకుండా ఐరన్‌ బారికేడ్లను నిర్మించారు. వినాయకఘాట్‌ మందిరాన్ని పూలు, విద్యుత్‌దీపాలు, మామిడి తోరణాలతో అలంకరించారు. కేసీ కెనాల్‌ నుంచి రాజ్‌విహార్‌ సెంటర్‌ వరకు కాషాయవర్ణం పతాకాలతో అలంకరించారు. రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్‌ వరకు ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం కేసీ కెనాల్‌లో పది అరిగిళ్లు నిర్మించారు. రోప్స్, టైర్‌ట్యూబ్‌లతో పాటు 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  ప్రస్తుతం కేసీ కెనాల్‌లో ఆరు అడుగుల నీరు ప్రవహిస్తోంది. భారీ విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం చేయాలంటే 8 అడుగుల నీటి ప్రవాహం అవసరం. గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి విజ్ఞప్తి మేరకు నీటి పారుదల శాఖ అధికారులు మరో రెండు అడుగుల నీరు వదలడానికి అంగీకరించారు.
భద్రత కట్టుదిట్టం..
 వినాయక నిమజ్జనం, బక్రీద్‌ పండుగలు ఒకే రోజు వచ్చినందున పోలీసు యంత్రాంగం నగరంలో భద్రత కట్టుదిట్టం చేసింది. సోమవారం ఎస్పీ ఆకె రవికష్ణ, జిల్లా పోలీసు పేరెడ్‌ మైదానంలో బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిమజ్జనం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సిబ్బంది అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం మూడు వేలకుపైగా సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. ప్రత్యేక పెట్రోలింగ్‌ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహం వద్ద ఓ పోలీసు తోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదుగురితో కూడిన ప్రత్యేక బందాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అల్లరి మూకలను నియంత్రించేందుకు వజ్రావాహనాన్ని రంగంలోకి దించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు సెక్టార్‌ ఇంచార్జిలు క్షేత్రస్థాయి సిబ్బందికి సెట్‌ ద్వారా సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీడియో, డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలను తరలించే బాధ్యతలను ఆయా స్టేషన్ల పరిధిలో కాలనీల వారీగా పోలీసులకు అప్పగించారు. సివిల్‌ పోలీసులతో పాటు నాలుగు ప్లటూన్ల ఏఆర్‌ సిబ్బంది, ఐదు ప్లటూన్ల ఏపీఎస్‌పీ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు
నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి ముందు రోజు మద్యం షాపులతో పాటు, బాణసంచా విక్రయించే దుకాణాలను మూసివేయించారు. మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శించే వారు, సంబంధంలేని వ్యక్తులపై రంగులు చల్లే ఆకతాయిలపై నిఘా కోసం మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ఒకే రోజు రెండు పండుగలు ఉన్నందున కర్నూలు నగరాన్ని బాంబ్, డాగ్‌స్వా్కడ్‌ బందాలు జల్లెడపట్టాయి. రామ్మూర్తి, గోపాల్, ఇనాయతుల్లా ఒక బందం, అంజన్‌బాబు, బాలయ్య, ప్రసాద్, సుబ్రమణ్యం మరో బందం, శ్రీనివాసులు, సత్యం, భాస్కర్‌లు మూడో బందంగా ఏర్పడి నగరమంతా విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. యామిని, టీనా, జాని డాగ్‌లతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ విజయమోహన్, ఎస్పీ ఆకె రవికృష్ణ సోమవారం వినాయక ఘాట్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: ఎస్పీ ఆకె రవికృష్ణ
 జిల్లాలో ఈ ఏడాది 4వేలకుపైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. నంద్యాల, ఆదోనిలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు పూర్తయ్యాయి. కర్నూలులో కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్న పుటేజీల ఆధారంగా చర్యలు తీసుకుంటాం.  

నియమావళి పాటించాలి
కర్నూలు(టౌన్‌): నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు గణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి రూపొందించిన నియామావళిని తప్పకుండా పాటించాలనిసమితి కార్యాధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక బుధవారపేటలోని కేశవ మెðlూరియల్‌ ఉన్నత పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఊరేగింపులో కాషాయ జెండాలు, టోపీలు ధరించాలన్నారు. ఈ ఏyది షోలాపూర్‌ నుంచి తలపాగాలు తెప్పించామన్నారు. ఊరేగింపులో మత్తు పానీయాలు సేవించడం, బాణసంచా కాల్చడం నిషేధించినట్లు చెప్పారు. మహిళలు విలువైన బంగారు నగలు ధరించకూడదన్నారు. పిల్లలు వెంట ఉంటే వారి జేబుల్లో పేరు, చిరునామా, సెల్‌నెంబర్‌  వివరాలను ఉంచాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పాదచారులపై రంగులు చల్లకూడదన్నారు. వినాయక ఉత్సవాలు, బక్రీద్‌ పండుగ ఒకేరోజు వస్తున్నందుకు హిందు, ముస్లింలందరు కలిసి మెలిసి పండగలను విజయవంతం చేద్దామన్నారు.సమావేశంలో గణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు క్రిష్టన్న, సందడి సుధాకర్, రంగస్వామి, కాళింగి నరసింహవర్మ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు