-

నో ఛాన్స్‌!

9 Aug, 2017 23:06 IST|Sakshi
నో ఛాన్స్‌!
పాతికేళ్లుగా కాకినాడలో అడ్రస్‌ లేని టీడీపీ
1992 తరువాత ప్రతి ఎన్నికలోనూ ఓటమే 
మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదీ చరిత్ర
ఈసారీ హిస్టరీ రిపీటేనా!
కాకినాడ : కేంద్రంలో చక్రం తిప్పినా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. జిల్లా కేంద్రం కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశంపార్టీ 25 ఏళ్లుగా అడ్రస్‌ లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మున్సిపల్‌ ఎన్నికలు జరిగినా, కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగినా కొద్దిపాటి కౌన్సిలర్‌ సీట్లతో గట్టెక్కడమే తప్ప అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ‘హిస్టరీ రిపీట్‌’ కాగలదన్న సంకేతాలు ప్రజల నుంచే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకత అవినీతిపాలన, పార్టీకేడర్‌లో తిరుగుబాటు నేపథ్యంలో ఈసారి కూడా అవే ఫలితాలు వస్తాయన్న పరిస్థితి కనిపిస్తోంది.
1987లో ఒకే ఒక్కసారి..
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యక్ష పద్ధతిలో సింబల్స్‌పై తొలిసారిగా 1987లో ఎన్నికలు జరిపించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల సీతారామమూర్తి నేరుగా మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు. అయితే అప్పుడు కూడా టీడీపీకి మెజార్టీ రాని పరిస్థితి ఎదురైంది. అప్పట్లో కాంగ్రెస్‌ 20 వార్డులను గెలుచుకోగా 18 టీడీపీ గెలుచుకుంది. ఆరుగురు టీడీపీ రెబల్స్‌ ఇండిపెండెంట్టుగా నెగ్గారు. ఆ పాలకవర్గం 1987 నుంచి 92 వరకు ఐదేళ్లపాటు కొనసాగింది. 
ఇక వరుస ఓటములే..
1987–92 మధ్య ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఆ తరువాత అన్నీ ఓటములే ఎదుర్కొంది. 92 నుంచి 95 వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. 1995లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభాజోసఫ్‌ కాంగ్రెస్‌ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌గా నెగ్గారు. ఐదేళ్ల తరువాత 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో డాక్టర్‌ బీరక చంద్రశేఖర్‌  కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
తొలి మేయర్‌లో మట్టి కరిచిన టీడీపీ
మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న టీడీపీ 2005లో జరిగిన తొలి కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ మట్టి కరిచింది. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలను నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ 30 కార్పొరేటర్లు గెలవగా తెలుగుదేశం 15 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో కాకినాడ తొలినగరపాలక సంస్థ తొలి మేయర్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇలా ఎప్పుడు మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగినా వరుస ఓటమిలతో కంగుతింటున్న టీడీపీ, మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలు జరగకుండా సవాలక్ష సమస్యలు సృష్టించి ప్రస్తుత కార్పొరేషన్‌ ఎన్నికలు జరగకుండా టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని వార్తలు