ఘాట్లకు కోతల్లేని కరెంట్‌

31 Jul, 2016 00:10 IST|Sakshi
– నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు
– ఆకర్షణకు ప్రత్యేక లైటింగ్‌ వెలుగులు
– 60 మంది సిబ్బందితో ప్రత్యేక టీములు
 
కర్నూలు(రాజ్‌విహార్‌):
 పుష్కరాలకు విద్యుత్‌ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం ఘాట్లకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన 348 విద్యుత్‌ స్తంభాలతోపాటు 100 కేవీఏ సామర్థ్యం ఉన్న ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు, నాలుగు జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక లైనులో సాంకేతిక సమస్య ఏర్పడితే మరో మార్గం ద్వారా సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద విద్యుత్‌ దీపాలతో ప్రత్యేక తోరణాలు నిర్మించనున్నారు. భక్తులను ఆకర్షించేందుకు లైటింగ్‌ ఎఫెక్ట్స్‌ సిద్ధం చేస్తున్నారు. సంగమేశ్వరం పుష్కర ఘాట్‌ వద్ద ఐదు కిలో మీటర్ల పొడవు 11కేవీ లైను, 7కిలో మీటర్లు ఎల్‌టీ ఏబీ కేబుల్‌ తీగను ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరం, లింగాటగట్టు వద్ద ఉన్న ఘాట్లలో లైటింగ్స్‌ ఏర్పాటు చేసేందుకు రూ.23.59 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించారు. ఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు జోన్‌ సీఈ పీరయ్యతోపాటు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ భార్గవ రాముడు ఓవరల్‌గా ఇన్‌చార్జ్‌లుగా, నలుగురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్‌మెన్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులతో కూడిన 60 మందిని విధుల్లో పాల్గొననున్నారు. మూడు ఘాట్ల వద్ద దేవుళ్ల చిత్రాలు ప్రతిబింబించేలా ఎల్‌ఈడీ లైట్లు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కర్నూలు ఆపరేషన్స్‌ డీఈ రమేష్‌ పేర్కొన్నారు.
 
ఘాట్ల వారీగా ఏర్పాట్ల వివరాలు
    శ్రీశైలం ఘాటు      లింగాల ఘాట్‌ సంగమేశ్వరం ఘాట్‌
 విద్యుత్‌ స్తంభాలు   35 39 273
ట్రాన్స్‌ఫార్మర్‌  100 కేవీఏ   100 కేవీఏ    100కేవీఏ
జనరేటర్‌  ఒకటి   ఒకటి               రెండు
సూపర్‌వైజర్లు    ఇద్దరు   ఇద్దరు  ఇద్దరు
సిబ్బంది    13    ఏడుగురు   11  
 
మరిన్ని వార్తలు