నల్లగొండ రూరల్ : మహారాష్ట్రతో ఒప్పందంతో ఒరిగేదేమీ లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెబుతు పాలనను నెట్టుకొస్తున్నారని అన్నారు. సాగర్నీటి విడుదల చేసి ఖరీఫ్ సాగుకు పూర్తిస్థాయిలో నీరందించాలని అన్నారు. ప్రచార ఆర్భాటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వృథా చేస్తుందని విమర్శించారు. పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.20వేల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, శ్రీనివాసాచారి, సత్యనారాయణ, తదితరులున్నారు.