భీమారం : మిషన్ కాకతీయ కింద చెరువు పనులను కాంట్రాక్టర్లు నామమాత్రంగా చేస్తున్నారు. మెుదటి విడతలో ఇలా చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకున్నారు. రెండో విడతలోనూ ఇలాగే చేసి బిల్లులు పొందాలనుకునే సమయంలో ఈ పనుల్లో అవినీతి భారీ వర్షాలతో బట్టబయలైం ది. హసన్పర్తి మండలంలో మిషన్ కాకతీయ కింద మెుదటి విడతలో 20 చెరువులు, రెండో దశలో 10 చెరువులను ఎంపికయ్యాయి. ఇందు లో కొన్ని చెరువుల పునరుద్ధరణ పనులు నామమాత్రంగా చేయగా, మరికొన్నింటి పనులు అసలే చేపట్టలేదు. అయినా కాంట్రాక్టర్లు బిల్లు లు పొందారు. ఇందుకు అధికారులు పూర్తిగా సహకరించారు. భారీ వర్షాలు కురవగా ఈ అవి నీతి బహిర్గతమైంది. ప్రస్తుతం కొన్ని చెరువుల కట్టలకు బుంగలు పడగా, మరికొన్ని చెరువుల తూములు లీకయ్యాయి. కాంట్రాక్టర్లు మెురం పోసి క్యూరింగ్, రోలింగ్ సరిగా చేయకపోవడంతో దెబ్బతిన్నాయి. మెుదటి విడతలో మెు రం పోసి ఎలాంటి రోలింగ్ చేయకపోవడంతో హసన్పర్తి, సీతంపేట, వంగపహాడ్, దేవన్నపేట (పడమర చెరువు), ముచ్చర్ల (భీమునికుంట) చెరువుల కట్టలు దెబ్బతిన్నాయి.
రెండో విడత పనులు మరీ అధ్వానం
రెండో విడత మిషన్ కాకతీయ పనులు మరీ అధ్వానంగా మారాయి. ముచ్చర్లలోని ఉరచెరువు కట్ట వర్షానికి దెబ్బతిన్నది. ఈచెరువు అభివృద్ధికి రూ.72లక్షలు కేటాయించగా, కట్ట నిర్మాణానికి సుమారు రూ.15.95లక్షలు ఖర్చు చేశారు. కోమటిపల్లి చెరువు కట్టకు సరైన రోలింగ్ చేయకపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ చెరువు అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరయ్యాయి. కాగా ఈ పనుల్లో జరిగిన అవినీతిపై కలెక్టర్ స్పందించి ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.