ఎ.కొండూరు: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని, అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి చెప్పారు. ఎ.కొండూరులో అయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన పై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. 2019లో తిరువూరు నియోజకవర్గం నుంచే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుకుగా పాల్గొని సైనికుల్లా పనిచేస్తున్నారని, ప్రజలకు అండగా ఉండి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. టీడీపీలోకి తనను ఆహ్వానించిన నాయకులు ఎవ్వరూ లేరని ఎవరైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ననకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని, రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పాలం ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షులు భూక్య గనియా, టి.వెంకటేశ్వరరెడ్డి, కంభంపాడు సర్పంచ్ కోట పుల్లారావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.