చాంద్రాయణగుట్ట: ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్ స్పెక్టర్ యాదగిరి కథనం ప్రకారం... అచ్చిరెడ్డినగర్కు చెందిన మహ్మద్ సలీం(35) ఫలక్నుమా పోలీస్స్టేషన్ రౌడీషీటర్. సంజయ్ గాంధీనగర్లో నివాసముండే సమీప బంధువు మహ్మద్ ఇర్ఫాన్ (27) కూడా రౌడీషీటర్. ఇతను తరచూ సలీం ఇంటికి వచ్చేవాడు.
సలీం నిత్యం స్నేహితులతో కలిసి మద్యం తాగడం గమనించిన ఇర్ఫాన్ ఎక్కువగా తాగవద్దని అతడికి సూచించాడు. నా విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సలీం..ఇర్ఫాన్ను హెచ్చరించడంతో ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి 11.30కి స్థానిక 786 హోటల్కు సలీం తన స్నేహితుడు సారిఖ్ ఖాన్, సిమ్లాలతో వచ్చాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఇర్ఫాన్–సలీంల మళ్లీ వివాదం మొదలైంది. దీంతో రెచ్చిపోయిన ఇర్ఫాన్ తన వద్ద ఉన్న కత్తితో సలీం గొంతు భాగంలో రెండు పొట్లు పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న సలీంను ఫలక్నుమా పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. హత్య జరిగిన సమయంలో ఇర్ఫాన్ కు తోడుగా అఫ్రోజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.