ఉపాధి కూలీలకు ఊరట

19 Feb, 2017 22:59 IST|Sakshi
ఉపాధి కూలీలకు ఊరట
వేసవి అలవెన్స్‌ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ
జిల్లాలో 14.95 లక్షల మందికి లబ్ధి
 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రత్యేక వేసవి అలవెన్స్‌లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు జీవో నంబరు 61 విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల నుంచి జూన్‌ వరకు ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్‌ ఇస్తారు. ప్రభుత్వం గరిష్టంగా అందిస్తున్న రూ.194తోపాటు అదనంగా వేసవి అలవెన్స్‌లు అందుతాయి. - రాయవరం
అలవెన్స్‌లు చెల్లిస్తారిలా..
వేసవి అలవెన్స్‌ను ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం చెల్లిస్తారు. ఒక కూలీకి గరిష్ట వేతనం రూ.194 చెల్లిస్తారు. వేసవి అలవెన్స్‌ ప్రకారం ఆ నెలలో ప్రకటించిన అలవెన్స్‌ శాతానికి అనుగుణంగా చేసే పనిని కొలతల్లో తగ్గిస్తారు. ఉపాధి కూలీలకు గరిష్టంగా రూ.194 వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. రవాణా ఖర్చు కింద శ్రమశక్తి సంఘాలకు చెందిన సభ్యులకు తాము పనిచేస్తున్న ప్రాంతానికి ఐదు కిలోమీటర్లు దాటితే గ్రూపులోని సభ్యులందరికీ రూ.15, దివ్యాంగులైతే రూ.20, వికలాంగ శ్రమశక్తి సంఘాలకు దూరంతో సంబంధం లేకుండా రూ.10 రవాణా ఖర్చు చెల్లిస్తారు. పనులకు సంబంధించి గడ్డపార తీసుకుంటే రూ.10, గంపకు రూ.3 అందించనున్నారు. తాగునీటికి ప్రతి సభ్యుడికి ఐదు లీటర్ల నీటికి రోజుకు రూ.5 వేతనంతో పాటు చెల్లిస్తారు. పనిచేసే ప్రదేశంలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుకు రూ.3, షేడ్‌నెట్‌కు రూ.10 ప్రతి రోజు అందిస్తారు. 
14.95 లక్షల ఉపాధి కూలీలు..
జిల్లాలో 14.95 లక్షల మంది జాబ్‌కార్డు కలిగిన ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో ఐదు లక్షల 49 వేల 973 మంది మాత్రమే కూలి పనులు చేస్తున్నారు. 44,632 శ్రమశక్తి సంఘాలున్నాయి. ప్రస్తుతం 80 వేల నుంచి 90 వేల మంది వరకు జిల్లాలో పని చేస్తుండగా మార్చి, ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో కూలీల సంఖ్య మూడు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 
ఎక్కువ కూలీ లభించే అవకాశం ఉంది..
ప్రభుత్వం కల్పించిన సమ్మర్‌ అలవెన్స్‌ వల్ల ఉపాధి కూలీలకు ఎక్కువ లబ్ధి కలిగేందుకు అవకాశం ఉంది. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ పని దినాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. 
- అల్లూరి వరప్రసాద్, ఏపీడీ, రాజమహేంద్రవరం
మరిన్ని వార్తలు