ఆర్టీసీ బస్సులో వృద్ధుడి మృతి

17 Oct, 2016 19:51 IST|Sakshi

హత్నూర (సంగారెడ్డి జిల్లా) : బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం శిలాంపల్లికి చెందిన పడమటి నారాయణరెడ్డి(75) తన కొడుకు చంద్రారెడ్డి, మనువడు నవకాంత్‌రెడ్డితో కలిసి జోగిపేట నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే సంగారెడ్డి డిపో బస్సులో శిలాంపల్లి వద్ద ఎక్కారు.

బస్సు హత్నూర మండలం సిరిపుర బస్టాప్ వద్దకు రాగానే ఒక్కసారిగా నారాయణరెడ్డికి గుండెపోటు వచ్చి బస్సులోనే మృత్యువాత పడ్డాడు. దీంతో వెంట ఉన్న కొడుకు, మనువడు ఆందోళనకు గురై బోరున విలపించారు. అనారోగ్యంతో ఉన్న నారాయణరెడ్డిని హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు తీసుకెళ్తుండగా బస్సులో మరణించాడని అతని కొడుకు, మనువడు తెలిపారు. అనంతరం ప్రయాణికులు, స్థానికులు మృతదేహాన్ని స్వగ్రామమైన శిలాంపల్లికి పంపించారు.

>
మరిన్ని వార్తలు