మెట్లపై నుంచి జారిపడి వృద్ధుడి మృతి

12 Sep, 2016 23:12 IST|Sakshi
మెట్లపై నుంచి జారిపడి వృద్ధుడి మృతి
 
నాయుడుపేటటౌన్‌ : ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శివాలయం సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... తమిళనాడు ప్రాంతానికి చెందిన ముప్పాల నారాయణ (70) నాయుడుపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, పిల్లలు లేరు. పలు దుకాణాల్లో పనిచేస్తూ పాఠశాలలో నిద్రిస్తుంటాడు. పట్టణానికి చెందిన యద్దల ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబీకులు అతనికి చేదోడుగా వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ భోజన వసతి ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఇబ్రహీం పిల్లలకు బక్రీద్‌ పండగ సందర్భంగా వస్తువులు కొనిచ్చేందుకు ఇంటి మిద్దెపైకి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాతు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఏఎస్సై శంకర్‌రాజు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నారాయణను ఆదరించిన కుటుంబీకులకు అప్పగించారు.
ఆదరించిన కుటుంబాల రుణం తీర్చుకున్న మృతుడు 
 అనాథగా ఉన్న వృద్ధుడు నారాయణను ఆదరించిన ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబాల రుణం తీర్చుకునేలా చర్యలు చేపట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల పేర లక్షల రూపాయల నగదును వారి పేరున ఇన్సూరెన్స్‌ చేసి ఉన్నాడు. దీంతో నారాయణకు అంత్యక్రియలను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. అయితే మృతుడికి ప్రతాప్‌రెడ్డి తలకొరివి పెట్టి అతని రుణాన్ని తీర్చుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల బాగోగులు చూస్తుండే నారాయణ మృతి పట్ల ఆ పాఠశాల హెచ్‌ఎం బాబుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు