రణస్థలం : పైడిభీమవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలోని చిన్న నడిపిల్లి గ్రామానికి చెందిన జాడ కోటేశ్వరరావు(20) అరబిందో పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం డ్యూటీకి వస్తూ రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు తల్లిదండ్రులు, భార్య ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. రణస్థలం ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.