అత్తారింటికెళ్తూ పరలోకాలకు..

26 Jun, 2017 22:22 IST|Sakshi
అత్తారింటికెళ్తూ పరలోకాలకు..

రోడ్డు ప్రమాదంలో పత్తికొండవాసి దుర్మరణం
గుత్తి (గుంతకల్లు) : అత్తారింటికి వెళుతున్న యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తికొండ వాసి దుర్మరణం చెందాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం వద్ద నివాసముండే కారు డ్రైవర్‌ నేసే రాజు (35) సోమవారం తన అత్తగారి ఊరైన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడుకు ద్విచక్ర వాహనంలో బయలు దేరాడు. మార్గం మధ్యలోని గుత్తిలో నంబర్‌ వన్‌ హాస్టల్‌ వద్ద ఎదురుగా వెళుతున్న ఇన్నోవా కారు ఎదురుగా స్పీడు బ్రేకర్‌ ఉండటంతో డ్రైవర్‌  సడెన్‌ బ్రేక్‌ వేశాడు.

కారు ఉన్నపళంగా ఆగడంతో ఆ వెనకే వేగంగా వస్తున్న రాజు అదుపు తప్పి కారును ఢీకొన్నాడు. కారు పైనుంచి రోడ్డుపైకి ఎగిసిపడినపుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని హెడ్‌ కానిస్టేబుల్‌ విజయుడు, కుమార్‌లు పరిశీలించారు. సీఐ ప్రభాకర్‌ గౌడ్‌ కేసు నమోదు చేసుకున్నారు. మృతినికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజు మరణ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ గుత్తి ఆస్పత్రికి వచ్చి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.

మరిన్ని వార్తలు