వంద రోజుల్లో 100 శాతం అక్షరాస్యత!

21 Nov, 2015 03:15 IST|Sakshi
వంద రోజుల్లో 100 శాతం అక్షరాస్యత!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 100 రోజుల్లో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం ఓకే చెప్పగానే వీలైతే డిసెంబరు 1 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. 15 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రత్యేక అక్షరాస్యత కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. మొత్తానికి మార్చిలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.

 జాతీయ స్థాయిలో 32వ స్థానంలో ఉన్న తెలంగాణ.. దేశ సగటు అక్షరాస్యతకంటే వెనకబడి ఉంది. దేశ సగటు అక్షరాస్యత 72.99 శాతం ఉండగా, తెలంగాణ అక్షరాస్యత 66.46 శాతం ఉంది. రాష్ట్రంలో 3,52,86,757 మంది జనాభా ఉంటే అందులో 82,02,192 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అందులో 15 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న వారు 50 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రస్తుతం వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. తెలుగు అక్షరమాలతోపాటు చదవడం, రాయడం, లెక్కలు చేసుకోవడం వంటి కనీస పరిజ్ఞానాన్ని అందించేందుకు 15 పాఠాలతో ప్రత్యేకంగా తెలంగాణ వాచకాన్ని రూపొందించింది.

వీటిని తెలంగాణ యాస, మాండలికం, సామెతలతో కూడిన వాడుక భాషలో రూపొందించారు. నిరక్షరాస్యులు సులువుగా నేర్చుకునేలా, సులభంగా అర్థం చేసుకునే పదాలతో దీనిని రూపొందించింది. ఇందులో వివిధ సంక్షేమ పథకాలను పేర్కొంటూ పూడిక తీసిన చెరువు-ఊరికి ఆదరువు, అవ్వకు ఆసరా-బిడ్డకు భరోసా, పూలు పేర్చితే బతుకమ్మ-అక్షరాలు నేర్చితే చ దువమ్మ, జజ్జనకరి జెనారే-తెలంగాణ భళారే వంటి పాఠ్యాంశాలను పొందుపరిచింది. ఈ పుస్తకాలను నిరక్షరాస్యులందరికీ పంపిణీ చేసి, ప్రతే ్యక ఉద్యమం తరహాలో ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కళాజాత, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు