రెండు ఆటోలు ఢీ

21 Jul, 2016 22:54 IST|Sakshi
రెండు ఆటోలు ఢీ
 తుమ్మపూడి (దుగ్గిరాల) : రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 15 రోజుల్లో వివాహ వేడుకలు జరగాల్సిన ఆ కుటుంబాన్ని ఆటో ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఘటనలో కుటుంబ యజమానురాలు మృతి చెందగా, పెళ్లి కుమార్తె తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తుమ్మపూడి గ్రామ సమీపంలో తెనాలి – విజయవాడ ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇంటి యజమానురాలు యాల్లమాటి అన్నపూర్ణ (35) మృతి చెందగా ఆమె కుమార్తె సువార్త తీవ్రంగా గాయపడింది. ఇంటి యజమాని స్వల్ప గాయాలతో బయట పడ్డారు. చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన యల్లమాటి ప్రసాద్‌ తన భార్య అన్నపూర్ణ, పెళ్లి నిశ్చయమైన కుమార్తె సువార్తతో కలిసి వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు దుగ్గిరాల మండలం వస్తున్నారు. ప్రసాద్‌ ఆటో నడుపుతుండగా కుమార్తె, భార్య వెనుక సీట్లో కూర్చున్నారు. ఆటో తుమ్మపూడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొంది. ప్రమాదంలో అన్నపూర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె సువార్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్‌ స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడి ముఖంపై రక్తం కారుతూ ఏడుస్తున్న కుమార్తెను ప్రసాద్‌ తన ఒడిలోకి తీసుకుని హాస్పటల్‌కి తీసుకెళ్లండి సార్‌.. అంటూ అక్కడి వారిని వేడుకోవడం అందరినీ కలచివేసింది. ఒకవైపు భార్య విగత జీవిగా పడి ఉండగా, కుమార్తెను అయినా బతికించుకునేందుకు కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. అయితే, ఘటనా స్థలానికి 108 అంబులెన్స్‌ రావడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మన్నెం మురళీ అక్కడకు చేరుకుని బాధితురాలిని హుటాహుటిన తన జీపులో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై దుగ్గిరాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు