బెల్లంపల్లి : సకలజనుల సమ్మె వేతన బకాయిల చెల్లింపునకు అడ్డంకిగా ఉన్న సమ్మెకు ఒకరోజు ముందు డ్యూటీ చేయాలనే నిబంధనను ఎత్తి వేయడానికి సింగరేణి ౖచైర్మన్ శ్రీధర్ అంగీకారం తెలిపినట్లు టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి చైర్మన్తో టీబీజీకేఎస్ అధ్యక్ష,కార్యదర్శులు జరిపిన చర్చలతో యాజమాన్యం ఆ నిబంధనను తొలగించడానికి ఒప్పుకుందన్నారు. ఆ నిబంధనవల్ల సుమారు రెండువేల మంది కార్మికులకు వేతన బకాయిలు చెల్లించడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అందులో వెయ్యిమంది వరకు తమ సంఘం కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. ఆ కార్మికులకు పది రోజుల్లో వేతన బకాయిలను యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పారు. జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న తప్పుడు ఒప్పందం వల్లనే ఆ అడ్డంకి ఏర్పడిందన్నారు. సమ్మె వేతన బకాయిల్లో తొలివిడతగా బుధవారం రూ.137 కోట్లు కార్మికులకు చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కార్మికుల పక్షాన తమ సంఘం అంకితభావంతో పని చేసస్తుందన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు ఎస్ సత్యనారాయణ , డి.శ్రీనివాస్ , బి.శంకర్ , నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.