ఆన్‌లైన్‌ స్నేహాలు

6 Aug, 2016 19:20 IST|Sakshi
ఆన్‌లైన్‌ స్నేహాలు
  • మెసేజ్‌లతో పెరుగుతున్న అనుబంధాలు
  • వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేక గ్రూపులు
  • నేడు ఫ్రెండ్‌షిప్‌ డే
  • సిద్దిపేట రూరల్‌ / జోగిపేట:  స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహనికి మధురస్మృతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు.

    కానీ నేడు కొంచెం ట్రెండ్‌ మారింది. సోషల్‌ మీడియా అనుబంధాలకు వేదికగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి అరచేతిలోనే టెక్నాలజీని వాడేస్తున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు ఉండడంతో ప్రతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఒక్క మెసేజ్‌ పోస్టుతో స్నేహితులందరికి శుభాకాంక్షలను సులువుగా చెపుతున్నారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

    ఫ్రెండ్‌షిప్‌ బాండ్లు కడతారు.. ఎస్.ఎం.ఎస్‌ లతో గ్రీటింగ్స్‌ చెబుతారు.. కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు. స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్‌ లేని ఎడారిలాంటిదనే చెప్పవచ్చు. ’నీ వెంట నేనున్నా’ అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. ఓటమిలో ఓదార్చేవాడే స్నేహితుడని చెప్పవచ్చు.

    ప్రస్తుత హైటెక్‌ యుగంలో..  స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరి చేతులో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ ఉంటుంది. వీటికి భలే క్రేజీ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్‌ స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరు పలకరించుకునే అవకాశం లభిస్తుంది. స్నేహితులు వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

    గ్రూపుల్లో మంచి, చెడులను పోస్టు చేస్తున్నారు. పోస్టులకు లైక్‌లు కొడుతూ, షేర్‌లు చేస్తూ అభిరుచులను పంచుకుంటున్నారు. సిద్దిపేటలో 2005లో టెన్త్‌ క్లాస్‌ పాసైన విద్యార్థులంతా కలిసి ‘స్కూల్‌మెట్స్‌’ అని వాట్సప్‌ గ్రూపును క్రియేట్‌ చేశారు. ఇందులో ఒకరినొకరు పలకరిస్తూ, స్నేహభావాన్ని పంచుకుంటున్నారు. స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఉద్యోగులు ఇలా గ్రూపులను ఏర్పాటు చేసుకుని స్నేహ సౌరభాన్ని ఆన్‌లైన్‌ వేదికగా కొనసాగిస్తున్నారు. ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో సుమారు 10కి పైగానే గ్రూపులు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు.  

    స్నేహంలో స్వార్థం ఉండకూడదు
    ఆపదలో ఉండి ధైర్యాన్ని ఇచ్చే వాడే నిజమైన స్నేహితుడు. స్వార్థంతో స్నేహం చేయడం మోసమే. స్నేహితుల మధ్య పెరిగేది స్నేహం పెరగాలే తప్ప తగ్గకూడదు. ఓటమిలోనూ నీవెంట నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. ఏళ్ల తరబడి స్నేహం చేసిన వారు ఈ సమాజంలో ఉన్నారు. కష్ట, సుఖాలలో కలిసి జీవించే వాడినే స్నేహితులుగా ఎన్నుకోవడం మంచిది. - అశోక్, చేనేత సహకార సంఘం చైర్మన్‌

    నాకు తల్లిదండ్రులు స్నేహితులే
    నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు స్నేహితులే. నేను పుట్టినప్పటి నుంచి అంధుడిగా ఉండడం వల్ల నా ఆలనా పాలనా చూస్తూనే స్నేహితులుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల కంటే  స్నేహితులంటేనే నాకు తృప్తి ఉంటుంది. స్నేహితుల కంటే ఎక్కువగా అన్ని విషయాల్లోనూ నాతో చర్చిస్తుంటారు. భగవంతుడు మరో  జన్మలో కూడా ఇలాంటి తల్లిదండ్రులనే ఇవ్వాలని కోరుకుంటాను. - విజయ్‌కుమార్, లెక్చరర్‌

మరిన్ని వార్తలు